
రైతుల పాలిట ‘భూ భారతి’ వరం
గణపురం: భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మే నెలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ధరణి ద్వారా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గణపురం మండలంలో జెన్కో, సింగరేణి సంస్థలలో భూములు కోల్పోయిన నిర్వాసిత ప్రజలు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో 10,900 ఎకరాలకు పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ చట్టం ద్వారా వారి సమస్య తీరుతుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో 70నుంచి 80శాతం సమస్యలు భూములకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రైతుల పాలిట ‘భూ భారతి’ వరం