
కలెక్టర్ల సమావేశంలో రాహుల్శర్మ
భూపాలపల్లి: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
చెక్కు అందజేత
భూపాలపల్లి అర్బన్ : రెండేళ్ల క్రితం మోరంచపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహాలక్ష్మి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుఫున మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో రూ.5లక్షల చెక్కును గడ్డం శ్రీనివాస్కు అందజేశారు.
జార్జిరెడ్డి స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి
కాటారం: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి విప్లవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని యువత ఉద్యమాల్లోకి రావాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్ అన్నారు. జార్జిరెడ్డి వర్ధంతిని కాటారం మండలకేంద్రంలో సోమవారం యూవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ దేశంలో యువత మారక ద్రవ్యాలకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను కోల్పోతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగి యువత మత, ప్రాంతీయ పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై నిజమైన విప్లవ ప్రజా పోరాటాలను నీరుగార్చుతున్నారని పేర్కొన్నారు. జార్జిరెడ్డి చూపిన విప్లవ ఆలోచనతో భగత్సింగ్, చేగువేరా, అల్లూరి సీతారామరాజు, కొమురంభీం, గోపాల్రెడ్డి విప్లవ స్ఫూర్తితో భారత ఐక్య యువజన సమాఖ్య, యూవైఎఫ్ఐ యువతి యువకులను సంఘటితం చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంతెన రాజశేఖర్, కాల్వల సమ్మయ్య, కళ్లెం రమేశ్, రవీందర్ పాల్గొన్నారు.
రామప్పలో మెక్సికో దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ డేనియల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్లు తాడబోయిన వెంకటేశ్, సాయినాథ్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు
వాజేడు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో సోమవారం వాల్పోస్టర్లు వెలిశాయి. మండల పరిధిలోని కొప్పునూరు కాలనీ, ఘణపురం గ్రామాల మధ్యన ఉన్న వంతెనకు అంటించారు. ‘మమ్మల్ని బతక నివ్వండి, నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చల విడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఇదేనా మీ సిద్ధాంతం’ అంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పలు రకాల హెచ్చరికలతో వాల్పోస్టర్లలో రాసి ఉంది.

కలెక్టర్ల సమావేశంలో రాహుల్శర్మ