అకాల వర్షం.. పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. పంట నష్టం

Apr 15 2025 1:16 AM | Updated on Apr 15 2025 1:16 AM

అకాల

అకాల వర్షం.. పంట నష్టం

ఈ ఫొటోలో ఉన్న రైతు దంపతులు కొండగొర్ల చిన్న దుర్గయ్య, దుర్గ. ఇద్దరు కలిసి రామన్నగూడెం శివారులో 5ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. పంట కోతదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయింది. పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఏటూరునాగారం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పొట్ట దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోగా పంటంతా నేలవాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, రొయ్యూర్‌, శంకరాజుపల్లి, ముళ్లకట్ట, చెల్పాక, చిన్నబోయినపల్లి, గోగులపల్లి, శివాపురం ప్రాంతాల్లో వరిపంట నేలవాలడంతో పాటు ధాన్యం నేలరాలింది. పంట చేతికొచ్చే తరుణంలోనే మాయదారి వర్షం నట్టేట ముంచిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదిలా ఉండగా మిర్చి కాయలను కోతకోసి కల్లాల వద్ద ఆరబెట్టగా తడిసిపోయింది. దీంతో మిరపకాయలు మచ్చలు రావడం, తొడిమె ఊడిపోవడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ ఉండబోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడితోటల్లోని కాయలు సైతం గాలివానకు రాలిపోయాయి. పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతిన్న పంటల పరిశీలన

మండల పరిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి సుమారువెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నేటినుంచి సర్వే మొదలవుతుందని ఏఓ వేణుగోపాల్‌ తెలిపారు. రైతులు అధైర్య పడకుండా పంటను కాపాడుకునే సూచనలను వివరించినట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలను పరిశీలించి నష్టాన్ని సర్వేచేసి నివేదిక అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

వరి పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి. అకాల వర్షం రైతులను కోలుకోలేకుండా దెబ్బతీసింది. వందలాది ఎకరాలల్లోని వరిపంట నేలబారింది. పొట్టదశలో ఉన్న వరిపంట వర్షం దాటికి కంకులు రాలి నీటిలో మునిగి పోయాయి. పంటను కోసే పరిస్థితి లేకుండా పోయింది. వరిపొలాలను చూస్తే దుఖం ఆగడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం.

– సునారికాని శ్రీనివాస్‌, రైతు, ఏటూరునాగారం

వందలాది ఎకరాల్లో నేలవాలిన వరిపైరు

కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటకు దెబ్బ

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

అకాల వర్షం.. పంట నష్టం1
1/2

అకాల వర్షం.. పంట నష్టం

అకాల వర్షం.. పంట నష్టం2
2/2

అకాల వర్షం.. పంట నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement