
ఓపెన్కాస్టు తవ్వకాలను అడ్డుకుంటాం
భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి గ్రామంలో అధికారులు కూల్చేసిన రేకులషెడ్లు, పెంకుటిళ్లకు నష్టపరిహారం చెల్లించకుంటే కేటీకే–2 ఓపెన్ కాస్ట్ గని తవ్వకాలను అడ్డుకుంటామని బాధితులు తెలిపారు. కూల్చేసిన ఇళ్ల వద్ద శుక్రవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయటంలో తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు చల్లూరి సమ్మయ్య, సెగ్గం సిద్ధూ ఆరోపించారు. 2008లో ఓసీపీ–2 కోసం గడ్డిగానిపల్లి గ్రామంలో భూములను పూర్తిగా సింగరేణి స్వాధీనం చేసుకుని, గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. ఇంతవరకు వేరే ఏరియాకు తరలించకపోవడం వల్ల ఓపెన్కాస్ట్ నుంచి ఏర్పడుతున్న దుమ్ము ధూళితో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు కొందరు వారి పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే రాత్రి పూట సింగరేణి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వచ్చి కూల్చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు అడ్డుకున్న కొంతమంది మహిళలను అధికారులు బెదిరించడంతో పాటు సెల్ఫోన్లు బలవంతంగా తీసుకుని, మొత్తం 65 ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా కూల్చేసిన ఇళ్లకు పరిహారం చెల్లించకుంటే ఓసీపీ–2 పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రత్నాకర్, సదానందం, కుమార్, ప్రభుదాస్, మధుకర్, దేవేందర్, సంతోష్, లక్ష్మయ్య పాల్గొన్నారు.