జనగామ: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని జనగామ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ డీఈ సారయ్య, టెక్నికల్ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ విజయ్, ఎస్ఏఓ శంకర్తో పాటు ఏడీఈలు, ఏఈలతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, కొత్త విద్యుత్ సర్వీసులను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫెయిల్ అయిన వాటిని వెంటనే మార్చాలన్నారు. జిల్లాకు అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే స్టాక్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫీల్డ్ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోరాదని హెచ్చరించారు. ఎల్సీలు అడగొద్దని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ ఎల్సీలు కోరితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు సూచనలు
విద్యుత్ సిబ్బందిని ఎల్సీలు అడగవద్దని కోరుతూ, విద్యుత్ తీగలు తెగిపోయి నేలపై పడిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ముట్టుకోరాదని, దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ విద్యుత్కు సంబంధించిన పనులను రైతులు స్వయంగా చేయకుండా, విద్యుత్ శాఖ సిబ్బందికే సమాచారం ఇవ్వాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
అత్యవసర సేవలకు 1912కు
సమాచారం ఇవ్వండి
సమీక్షలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి


