● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నర్మెట: రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన ఆయన మాట్లాడారు.. వరి సన్నరకంతో పాటు పప్పు దినుసులు, చిరుధాన్యాలు, జొన్న పంటలను సాగు చేయాలని, కూరగాయలు, పండ్లతోటలతో అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని, పంటలు చేతికి వచ్చేవరకు విత్తన రశీదులను రైతులు భద్రపరచుకోవాలని తెలిపారు. నర్మెట వారాంతపు సంతలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును మంజూరు చేయాలని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట డీఏఓ అంబికా సోని, ఏడీఏ వసంత సుగుణ, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ ఉప్పుగళ్ల సంపత్ కుమార్, ఏఓ పి.మురళి బాబు, హెచ్ఓ కె.సందీప్, ఎఫ్ఓ దివ్య, ఏపీఓ రమాదేవి, ఏఈఓలు జగదీష్, అనిత, కన్నయ్య, సర్పంచ్లు, డీలర్లు, రైతులు ఉన్నారు.


