యోగాసనాలు చేయిస్తున్న గురువు గీతేష్ బజాజ్
జనగామ: యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవని అని, ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రుపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మల్లిఖార్జున్రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు గీతేష్ బజాజ్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించగా, వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ యోగా ద్వారా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులలో పాటు ఇతర జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ కోఆర్డినేటర్, డాక్టర్ మమత, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ వాణి, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
యోగాతో శారీరక దృఢత్వం,
మానసిక ప్రశాంతత
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం


