అదనపు కలెక్టర్ బెన్షలోమ్
పాలకుర్తి టౌన్: పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్ఓ) బెన్షలోమ్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ ఏజెంట్లను బీఎల్ఏలను వెంటనే నియమించి జాబితాలను సమర్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరిని ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేయించేందుకు, ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని, పేర్లు, ఫొటోలు, చిరునామాల్లో తప్పులకు ఫారం –8 ద్వారా సమర్పించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల బాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ప్రత్యేక సవరణ లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే క్లెయిములు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం క్షేత్రస్ధాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.


