న్యూస్రీల్
జిల్లాలకే కుట్టించే బాధ్యత టై, బెల్డ్, షూ అందజేసేందుకు చర్యలు గురుకుల విద్యార్థులకు అదనంగా 15 రకాల మెటీరియల్స్ లబ్ధి పొందనున్న 30 వేల మంది విద్యార్థులు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
మారనున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం రంగు
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మొదట రాష్ట్రస్థాయిలోనే యూనిఫాంలను కుట్టించి పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ప్రస్తుతం జిల్లాల వారీగా విద్యాశాఖ పర్యవేక్షణలో డీఆర్డీఓ(సెర్ఫ్), పురపాలిక పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలు కుట్టించే బాధ్యతలను అప్పగించారు.
కొత్తరంగులతో యూనిఫాంలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తిక్ బ్లూ ప్యాంట్, లైట్ బ్లూ షర్ట్ తో యూనిఫాం అందించనున్నారు. సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు మెరూన్ రంగు యూనిఫాం(పాతవే)లు ఇవ్వనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలతోపాటు బెల్ట్, షూస్ కూడా పంపిణీ చేయనున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు వాటితోపాటు అదనంగా మరో 15 రకాల వస్తువులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన మెటీరియల్ సరఫరా ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
30వేల మంది
విద్యార్థులకు లబ్ధి..
జిల్లాలో ప్రభుత్వరంగ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. రాబోయే నెల రోజు ల్లోపు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యూనిఫాంల కుట్టింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మండలాల వారీగా టైలరింగ్ పనులు చేపట్టే వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. గతంలో విద్యార్థులకు కొలతల విషయంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ‘మేకర్ కమ్ చెకర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. యూనిఫాం కొలతల్లో తేడాలు ఉంటే పాఠశాల స్థాయిలోనే సరిచేసి విద్యార్థులకు అందించేలా చేయనున్నారు.
నేడు వర్చువల్గా ప్రారంభించన్ను సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి నేడు(శుక్రవారం)వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాల, గురుకులాల నుంచి 8, 9, 10 తరగతులకు చెందిన 152 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 76 మంది బాలురు, 76 మంది బాలికలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన క్లాత్ రాగా, యూనిఫాంలను తయారు చేసి నేటికల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి జిల్లాకు అవసరమైన క్లాత్ పూర్తిస్థాయిలో చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు మూడో జత యూనిఫాం కూడా అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విద్యార్థులకు ఈ సారి కొత్త రంగులతో అందించే యూనిఫాంల మోడల్
పీఎస్లు : 341
యూపీఎస్ : 64
ఉన్నత : 103
కేజీబీవీ : 12
మోడల్ : 08
యూఆర్ఎస్ : 01
ఎయిడెడ్ : 10
రెసిడెన్షియల్ : 19
మొత్తం : 558
జిల్లాలో విద్యాసంస్థలు ఇలా..


