● ఉరుములు, మెరుపులతో వర్షం
● విరిగిన విద్యుత్ స్తంభాలు,
నేలకొరిగిన చెట్లు
● పలుచోట్ల తడిసిన ధాన్యం బస్తాలు
జఫర్గఢ్/పాలకుర్తి టౌన్/బచ్చన్నపేట: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి (జి), ఓబులాపూర్ గ్రామాల్లో వడగండ్ల వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల మూలంగా విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు చెట్లు నేలకొరిగాయి. దీంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ఇళ్ల పైకప్పు రేకులు సైతం గాలికి ఎగిరిపడ్డాయి. పాలకుర్తి మండలంలో సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం పడింది. పలు ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మండలంలోని తొర్రూరు(జె)గ్రామంలో కొనుగోళ్లు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. దయాకర్రావు మాట్లాడుతూ..తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.


