బచ్చన్నపేట: ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని రామచంద్రపురంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేపట్టాలన్నారు. పైపులైన్లకు మరమ్మతులు, నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళ భర్త సంవత్సరం క్రితం చనిపోయారని తనకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకోగా.. వారం లోపల ఆర్థిక సహాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, ఎంపీడీఓ లావణ్య, సర్పంచ్ బొందుగుల వినోద్కుమార్, ఉప సర్పంచ్ రవీందర్రెడ్డి, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


