8 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

8 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

కాశిబుగ్గ: కాకతీయ వైద్య కళాశాల కేఎంసీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి.మోహన్‌దాస్‌ను నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు డాక్టర్‌ మోహన్‌దాస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నర్సంపేట మెడికల్‌ కళాశాలలో పని చేస్తున్న ఆయన బదిలీపై అడిషనల్‌ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్‌గా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన డాక్టర్‌ సంధ్య నర్సంపేట మెడికల్‌ కళాశాలకు బదిలీపై వెళ్లారు. కాగా, నూతనంగా ప్రిన్సిపాల్‌ బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ మోహన్‌దాస్‌ గతంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ తదితర కోర్సుల (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లోని మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, హ్యూమనిటీస్‌ భవనంలోని పరీక్ష కేంద్రాలను కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ పరిశీలించారు. ఆయా పరీక్షలకు వందశాతం విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ మనోహర్‌ వారి వెంట ఉన్నారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కె.ప్రవీణ్‌ కుమార్‌ హనుమకొండ ట్రాఫిక్‌, సుబ్బారెడ్డి టాస్క్‌ఫోర్స్‌, దేవేందర్‌ టాస్క్‌ఫోర్స్‌, దామోదర్‌రెడ్డి సీసీఆర్‌బీ, చేరాలు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఎ.రమేశ్‌ ఏహెచ్‌టీయూ, ఎ.ప్రవీణ్‌కుమార్‌ పీసీఆర్‌, కమాండ్‌ కంట్రోల్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.

నేడు బూత్‌ లెవెల్‌

ఏజెంట్లకు శిక్షణ

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నేడు (మంగళవారం) ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పసరమడ్ల గ్రామం ఉషోదయ కన్వెన్షన్‌ హాల్‌ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి వస్తున్నారని, ఈ శిక్షణ కార్యక్రమంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్స్‌ ట్రైనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

దివ్యాంగులకు

ట్రై స్రైకిళ్లు అందజేత

జనగామ రూరల్‌: జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల పరిధిలోని సముద్రాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఈగ పారిజాతం, కొడకండ్ల మండలం నరసింగపురం గ్రామానికి చెందిన జేడీ చంద్రకళ తమ జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్‌ అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్‌ వెంటనే అదనపు కలెక్టర్‌ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి బెన్‌షాలోమ్‌కు వారి అర్హతలు పరిశీలించి ఇద్దరు లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు మంజూరు చేసి అందజేశారు.

మానవత్వం చాటుకున్న కలెక్టర్‌

జనగామ: కొండాపూర్‌ ఎర్రకుంట తండాకు చెందిన దివ్యాంగుడు బానోత్‌ రాములు పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెంటనే స్పందించి వీల్‌చైర్‌ అందజేశారు. ఈసందర్భంగా రాములు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కేఎంసీ ప్రిన్సిపాల్‌గా మోహన్‌దాస్‌

పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు షురూ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement