● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఈనెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నీట్పై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మంది, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 192మందితో కలిపి మొత్తం 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 వరకు ఉంటుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో నీట్ కో–ఆర్డినేటర్ ఏబీవీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవీంద్ర నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


