జనగామ/స్టేషన్ఘన్పూర్: జిల్లాలో పాలిసెట్–2026 బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో మొత్తం 1,615 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వీరిలో 1,527 మంది హాజరయ్యారు. ఇందులో 790 మంది బాలురు, 737 మంది బాలికలు ఉన్నారు. బాలుర హాజరు శాతం 95 శాతం, బాలికల హాజరు శాతం 94శాతం కాగా, జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా హాజరు శాతం 95శాతంగా నమోదైనట్లు శ్రీనివాస్ వెల్లడించారు.
ఒక నిమిషం ఆలస్యం
క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సెంటర్కు ఓ విద్యార్థి కేవలం ఒక నిమిషం ఆలస్యంగా రాగా..అధికారులు లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర నిరాశకు గురయ్యాడు. కాగా, విద్యార్థులను వెంట తీసుకొచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షల సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసులు అన్ని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు
1,615 మంది విద్యార్థులకు 1,527 మంది హాజరు


