
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరెట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన బడ్జెట్ ప్రకారం పెండింగ్ లేకుండా బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన 9 గ్రామ పంచాయతీల్లో గిరిజనుల సమస్యలపై ప్రధానమంత్రి దర్తీ ఆబ జాన్ భగీదారి అభియాన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏసీపీ డీఎస్డీఓ విక్రమ్, డీపీఓ స్వరూప, రాణా ప్రతాప్, భోజన్న పాల్గొన్నారు.
పక్కాగా భూగర్భ జలాల నిర్వహణ
భూగర్భ జల వనరుల పరిరక్షణలో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్లో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడానికి చర్యలు చేపట్టడంతోనే గణనీయంగా మార్పు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి అశోక్, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా