
కనీస వసతులేవి?
● ప్రభుత్వ మెడికల్ కళాశాల
ఏర్పాటుపై నీలినీడలు
● పూర్తిస్థాయిలో వసతులు
కల్పించకపోవడంతో ఎన్ఎంసీ షోకాజ్
● ఎనిమిది కేటగిరీల్లో లోపాలు
ఉన్నట్లు గుర్తింపు
● నేడు విచారణ, వర్చువల్ పద్ధతిలో
పాల్గొననున్న ప్రిన్సిపాల్
● సెప్టెంబర్ 15 నుంచి థర్డ్ ఇయర్ ప్రారంభం
జనగామ: ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంటారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నావనే టీచర్ ప్రశ్నకు విద్యార్థి నోటి నుంచి టక్కున వచ్చే జవాబు డాక్టర్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డాక్టర్ వృత్తిని కోరుకుంటారు. అంతటి ప్రాధాన్యం కలిగిన వృత్తిపై నీలినీడలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కనీస వసతి సౌకర్యాలు లేవని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఈ నెల 14వ తేదీన ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి మెడికల్ కళాశాలలో విద్యార్థుల బోధనకు తగ్గట్టుగా సౌకర్యాలు లేవని గుర్తించారు. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస మౌలిక వసతి సౌకర్యాలు, అధ్యాపకులు, విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ హాజరు ఎంబీబీఎస్ విద్యార్థుల బోధన సమయంలో సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు అవసరమైన మృతదేహాలు ఉండాలి.
కళాశాల నిర్వహణ ఇలా...
జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు చంపక్హిల్స్ మాతా శిశు సంరక్ష ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ఉంది. ప్రస్తుతం ఎంసీహెచ్ ప్రాంగణంలోని తాత్కాలిక రేకుల షెడ్డుల్లో ఏర్పాటు చేసిన మొదటి, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో విద్యార్థినులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించగా, విద్యార్థులు చంపక్హిల్స్లోని డీఆర్డీవో భవనంలో ఉంటున్నారు. వచ్చే సెప్టెంబర్ 15 నుంచి మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్న నేపధ్యంలో హాస్టల్తో పాటు తరగతి బోధనకు జిల్లా ఆస్పత్రి ఎదుట ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసును అద్దెకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
100 పడకలతో క్రిటికల్ కేర్
మెడికల్ కళాశాలలో సౌకర్యాలు లేవని ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఇందులో 90 శాతం మేర త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 100 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డీహెచ్లో ీసీటీ స్కాన్ సేవలను వారం రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కళాశాలలో 117 పోస్టులకు గాను రెగ్యులర్ ఉద్యోగులు 82, కాంట్రాక్టు 7 మంది విధులు నిర్వర్తిస్తుండగా, 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డు గీతానగర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనం ఆరునెలల్లో అందుబాటులోకి రానుంది.
నేడు వర్చువల్గా విచారణ
మెడికల్ కళాశాల నిబంధనలకు సంబంధించి ఢిల్లీలో నేడు (బుధవారం) జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు హాజరు కావాలని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) ఆదేశించింది. ఈ విచారణలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆయా కళాశాలల నుంచి వర్చువల్గా అందుబాటులో ఉండాలని కోరారు.
ఎనిమిది కేటగిరీల్లో లోపాలు..
జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు జాతీయ వైద్య కమిషన్ విచారణలో వెల్లడైయింది. మృతదేహాలు, పడకలు, సిటీ స్కాన్, ఎమ్మారై సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ఫారం–16 ఇన్ కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్కు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డీహెచ్, ఎంసీహెచ్లో ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి 420 వందల బెడ్లకు గాను 20 తక్కువగా ఉన్నాయి. బిగ్, స్మాల్ ఆపరేషన్ థియేటర్లు 12 ఉండాల్సిన చోట 9 మాత్రమే ఉన్నాయి. అలాగే క్రిటికల్ ఆపరేషన్ థియేటర్లు చిన్నవి, పెద్దవి కలిపి 5కు గాను ఒక్కటి లేవు. కొంతమంది డాక్టర్లకు సంబంధించి ఫాం–16 ఇన్కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్ ఇవ్వక పోవడాన్ని అందులో ప్రధానంగా చూపించారు.
సమస్యలన్నీ చిన్నవే..
జనగామ మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు చూపించారు. కళాశాల ప్రారంభ సమయంలో 6 మృతదేహాలు చూపించగా, ఆ తర్వాత మరో నాలుగువచ్చాయి. సీటీ స్కాన్ సేవలు మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వైద్యుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్కు సంబంధించి పైనుంచే మిషన్లు రాలేదు. ప్రస్తుతం ఎవరికి వారే సెల్ఫోన్ల ద్వారా హాజరు శాతం నమోదు చేసుకుంటున్నారు. ఫారం–16, డాక్టర్ డిక్లరేషన్ కంప్లీట్ చేస్తున్నాం. – డాక్టర్ గోపాల్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్

కనీస వసతులేవి?

కనీస వసతులేవి?