అంజన్న నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

అంజన్న నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి నిత్యాన్నదానం ట్రస్టుకు ఓ భక్తుడు రూ.లక్ష విరాళంగా అందించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీరంగధృవన్‌ పొన్నాల స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో అంజనారెడ్డి ఆయనకు రశీదు అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చి అభినందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ సునీల్‌ కుమార్‌, చెక్కిళ్ల అశోక్‌ పాల్గొన్నారు.

ఎక్స్‌రేతో క్షయ నిర్ధారణ

వెల్గటూర్‌: క్షయవ్యాధి నిర్ధారణ కోసం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఎక్స్‌రే శిబిరం నిర్వహించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు. గతంలో క్షయవ్యాధి బారిన పడిన, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన మందులు సూచించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ తేజశ్రీ, అంబారిపేట మెడికల్‌ ఆఫీసర్‌ లవకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రాయికల్‌లో త్వరలో డయాలసిస్‌ సేవలు

రాయికల్‌: పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో త్వరలో డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీఎం విజయ్‌ తెలిపారు. బుధవారం స్థానిక వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్‌ సేవలను పట్టణ, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు అందించే రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా టీం లీడర్‌ సురేశ్‌కుమార్‌, ఆరోగ్యమిత్ర మామిడి ఆంజనేయులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

జగిత్యాలరూరల్‌: పట్టణంలోని టౌన్‌–3 సెక్షన్‌ పరిధిలో 33/11 కేవీ హౌసింగ్‌బోర్డు సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్‌ మరమ్మతు దృష్ట్యా గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ గంగారాం తెలిపారు. తీన్‌ఖని చౌరస్తా, పెద్ద మసీదు, కటికెవాడ, మంచినీళ్ల బావి, ఇస్లాంపుర, గాంధీనగర్‌, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్‌పుర, రహ్మత్‌పుర, జెండామహెళ, ప్యారాబాయి, ఘోరెమియా, ఖిలాగడ్డ, తులసీనగర్‌, వాణీనగర్‌, హౌసింగ్‌బోర్డు, ఎలుకబావి వాడల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మార్కెట్‌ పనులు పూర్తి చేయండి

మెట్‌పల్లి: పట్టణంలోని సమీకృత మార్కెట్‌ పనులు పూర్తి చేయాలని బీజేపీ పట్టణాధ్యక్షులు దొనికెల నవీన్‌ ఆధ్వర్యంలో బుధవారం పాత బస్టాండ్‌ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంతవరకు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అర్ధాంతరంగా నిలిచిన పనులపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. మార్కెట్‌ పనులు పూర్తికాకపోవడంతో చిరు వ్యాపారులు రోడ్ల పక్కన ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అనూప్‌రావు, ఏలేటి నరేందర్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement