మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు రావాలని దేవా దా య శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అధి కారులు ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల 10 నుంచి 12 వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, సునీల్, స్థానాచార్యులు కపీందర్, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు.
44.9 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 44.9, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.7, కొడిమ్యాల మండలం పూడూరులో 44.6, రాయికల్ మండలం అల్లీపూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 44.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 44డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
‘రైతువారం’ కార్యక్రమాలు ఇలా..
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతువారం నిర్వహిస్తున్నట్లు డీఏవో భాస్కర్ తెలిపారు. ఈనెల 4 అన్ని రైతువేదికల్లో నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పాం సాగు విస్తరణ, ప్రత్యామ్నాయ పంటలు, 6న పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీవోల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెటింగ్ అవకాశాలు, 7న వ్యవసాయ యంత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, వ్యవసాయ యాంత్రీకరణ, 8న పాడి పరిశ్రమ, పశు అభివృద్ధి, పశుసంరక్షణ, చేపల అధిక ఉత్పత్తికి చర్యలు, 9న సన్నరకాల సాగుపై అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు.
పంట మార్పిడితో తెగుళ్లకు చెక్
జగిత్యాలఅగ్రికల్చర్: పంట మార్పిడితో తెగుళ్లు, పురుగులకు చెక్ పెట్టవచ్చని పొలాస శాస్త్రవేత్త బి.శ్రీనివాస్ అన్నారు. రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సమావేశం నిర్వహించారు. ఏ పంటకై నా నీటిని ఎక్కువగా ఉపయోగించరాదని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. సర్పంచ్ గంగోత్రి, ఏఈవో రవళి, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.
నేడు ‘నీట్’..
జగిత్యాల: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్– 2026 ఆదివారం జరగనుంది. జగిత్యాలలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నాచుపల్లి జేఎన్టీయూలో రెండు కేంద్రాలు గుర్తించారు. మొత్తం 796 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష కేంద్రానికి 1.30 గంటల వరకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్టికెట్, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, వాటర్బాటిల్కు అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనమతించరు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సిటి కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
డివిజన్ స్థాయిలో
ప్రజావాణి
జగిత్యాల: జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 4 నుంచే ప్రారంభమవుతుందని, డివిజన్లకు సంబంధించి ఆర్డీవో నోడల్ అధికారిగా నియమించాని పేర్కొన్నారు. డివిజన్స్థాయి అధికారులు హాజరై వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో యథాతథంగా జరుగుతుందని పేర్కొన్నారు.


