చెరువు.. పట్టింపు కరువు
కథలాపూర్(వేములవాడ): గ్రామాలకు సాగు, తాగునీరందించి భూగర్భజలాలు పెంచడంలో ప్రధానమైన చెరువులు గతేడాది కురిసిన వర్షాలకు గండ్లు పడి నీరంతా వృథాగా పోయింది. వర్షాలతో నష్టపోయిన చెరువులను అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పట్లో పరిశీలించారు. కాగా, మరమ్మతు విషయంలో జాప్యం జరగడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు తక్కువగా ఉండటంతో వాటి మత్తడి, తూములకు మరమ్మతు చేస్తే వర్షకాలంలో కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరమ్మతు చేయాల్సిన ప్రధాన చెరువులు..
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి ప్రధానమైన కొచ్చెరువు మత్తడి గతంలో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైంది. దుంపేట శివారులోని ఊర చెరువు తూం వద్ద కట్ట కోతకు గురైంది. పెగ్గెర్ల శివారులోని ఊర చెరువు మత్తడి పగుళ్లు బారి నీరు వృథాగా బయటకు పోతోంది. వర్షాలతో నష్టపోయిన చెరువులను అప్పట్లో ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించారు. మరమ్మతు చేయిస్తామని చెప్పి ఇప్పటివరకు పురోగతి లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరమ్మతు చేయిస్తే వర్షకాలంలో నీళ్లు నిల్వ ఉండి ఏడాది పాటు సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పెగ్గెర్ల ఊర చెరువు మత్తడికి పగుళ్లు బారి లీకవుతున్న నీరు
కోతకు గురైన దుంపేట ఊర చెరువు కట్ట
చెరువు.. పట్టింపు కరువు


