ష్.. గప్ చుప్
వారంపాటు హోరెత్తిన ప్రచారం వాడలన్నీ చుట్టేసిన అభ్యర్థులు పార్టీ పెద్దలతో కార్నర్మీటింగ్లు గడువు ముగియడంతో సైలెంట్ మోడ్.. ప్రలోభాలతో ఓటర్లకు ఎర వేసే ప్రయత్నం
జగిత్యాల: మున్సిపాలిటీల్లో ప్రచారపర్వం ముగిసింది. వారంపాటు మైకులు, లౌడ్స్పీకర్లతో అభ్యర్థులు హోరెత్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీగల్లీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రధాన పార్టీల నాయకులను రప్పించి మాట్లాడించారు. ప్రచారానికి గడువు ముగియడంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థులందరూ సైలెంట్మోడ్లోకి వెళ్లిపోయారు. ఈనెల 11న పోలింగ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్లి చివరిప్రయత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
వార్డుల వారీగా ప్రత్యేక దృష్టి
గెలుపులో ఒక్క ఓటు కూడా ముఖ్యం కావడంతో అభ్యర్థులు ప్రతివార్డులోని ఓటర్లను అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహిళా సంఘాలు, యువ త, వ్యాపారవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. మంగళవారం కూడా వ్యక్తిగతంగా ఇంటింటా తిరుగుతూ చివరి ప్రయత్నంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై పోటాపోటీగా ప్రకటనలు చేశారు. అధికా ర పార్టీ నేతలు వారు చేపడుతున్న సంక్షేమ పథకాలపై వివరించగా.. బీజేపీ కేంద్రం అందిస్తున్న నిధులతోనే అ న్ని సౌకర్యాలు సమకూరుతున్నాయని వివరించారు. బీఆర్ ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. అమలుచేయని హామీలను ప్రజలకు వివరించారు.
ఇక ధన ప్రవాహం..
ఇప్పటికే ఒక్కో అభ్యర్థి వార్డుల్లో విందులు, వినోదాలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఓ అభ్యర్థి 200 మందికి భోజనాలు పెట్టిస్తే.. మరో అభ్యర్థి 400 మందికి పెట్టించడం గమనార్హం. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లారు. ఎలాగైనా కౌన్సిలర్ పదవిని దక్కించుకునేందుకు ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అధికా రులు మాత్రం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పే ర్కొంటున్నారు. అభ్యర్థులు చూపే ఆశలకు ఓటర్లు లోనవుతూ..
ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ఖర్చును నిరోధించేందుకు యాక్ట్ ఉన్నా.. ఒక్కో అభ్యర్థి రూ. 10లక్షల నుంచి రూ.20లక్షలపైనే ఖర్చు చేస్తున్నారు.
కుల పెద్దలతో మంతనాలు
వార్డుల్లో మహిళాసంఘాల ఓట్లే కీలకం కావడంతో గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. అలాగే వివిధ కుల సంఘాల పెద్దలను ఆశ్రయించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయా వర్గాల ఓట్లు ఎన్ని ఉన్నాయి..? ఎన్ని
పడతాయి..? అని పెద్దలతో చర్చిస్తూ ఓట్లు తమకే రావాలంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే హామీలు కూడా గుప్పిస్తున్నారు. వార్డుల్లో ఏం పనులు కావాలన్నా.. గెలిచిన వెంటనే చేస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రతి కాలనీలో సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా లో ఏయే సామాజిక వర్గాలు ఎంత మంది ఉన్నారు..? ఎన్ని ఓట్లు ఉంటాయి..? పోల్ మేనేజ్మెంట్ను శాసించే సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకుంటే విజయం వరిస్తుందని ఆలోచిస్తున్నారు.
దూర ప్రాంతాల వారిని రప్పించేందుకు..
అభ్యర్థులు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే వాహనాలు సమకూర్చడం, బస్ చార్జిలు పంపించేలా చూస్తున్నారు. యువత ఎక్కువగా చదువు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటోంది. అలాంటి వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వ్యూహాలు.. ప్రతివ్యూహాలు
మున్సిపాలిటీ పరిధిలో కాలనీల వారీగా ఇప్పటికే సర్వే చేయించిన ప్రధాన పార్టీల నాయకులు.. నివేదికలు తెప్పించుకుని వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా ఆయా పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్ ద్వారా డబ్బులు ఎలా పంపిణీ చేయాలని చూస్తున్నారు. పార్టీల నాయకులు తమకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా డబ్బులు, ఇతరత్రా వస్తువులను పంపుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ష్.. గప్ చుప్


