ప్రచారంలో పదనిసలు
కోరుట్ల: పట్టణంలోని ఓ వార్డులో పండ్లు అమ్ముకునే ఓ అభ్యర్థి తనకు అప్పటివరకు బాకీ ఉన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, ఓటుమాత్రం తనకే వేయాలని తాయిలాలు ప్రకటించడం గమనార్హం. ఆయన వద్ద పండ్లు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మకాలు సాగించే వారంతా ఫుల్ ఖుష్ అయిపోయారు.
ఒక్కరోజు 3 క్వింటాళ్లు
పట్టణంలోని వేములవాడ రోడ్ వెంట ఉన్న ఓ వార్డులో ఓ అభ్యర్థి ఆదివారం ఒక్కరోజే సుమారు 3 క్వింటాళ్ల మటన్తో భోజనం పంపిణీ చేశాడు. ఇప్పటివరకు అభ్యర్థులు కేవలం చికెన్తో సరిపెట్టగా.. ఆ అభ్యర్థి మాత్రం ఏకంగా మటన్తో భోజనాలు పెట్టించడం విశేషం. ఈ సంగతి తెలియగానే ఆయన ప్రత్యర్థి వెంటనే రెండు క్వింటాళ్ల చికెన్ను అదే వార్డులో ఇంటింటికీ పంపిణీ చేయడం కొసమెరుపు. మొత్తంగా సదరు వార్డులోని అన్ని ఇళ్లలో మటన్, చికెన్, మందు బాటిళ్లు కనిపిస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఇంటింటికీ గిఫ్ట్లు
పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటు కోసం ఖరీదైన గిఫ్ట్లు పంపిణీ చేస్తున్నారు. వాటిలో పూజకు ఉపయోగించే ఇత్తడి, వెండి దీపాలు, మంగళహారతులు, చీరలు, వెండి బిళ్లలు, భగవద్గీత పంపిణీ చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో నగదు, మందు పంపిణీ జోరుగా సాగింది.
బీడీలు బంద్
వారం రోజులుగా మహిళలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో బీడీలు చుట్టడం బంద్ అయిందని కమీషన్ ఏజంట్లు మొత్తుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి అన్ని వార్డుల్లో మహిళలు అభ్యర్థులు, కీలక నేతల ప్రచార కార్యక్రమానికి హాజరుకావడంతో బీడీలు చేసే వారే లేకుండా పోయారు.
బకాయిలు మాఫీ
ప్రచారంలో పదనిసలు


