ప్రభుత్వానికి మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించండి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల: ప్రభుత్వానికి మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించాలని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానన్నారు. మున్సిపాలిటీలో గెలిస్తే ధర్మపురి రోడ్లో గంగపుత్రులకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లిలో రూ.10 లక్షలు, కల్లెడలో రూ.20 లక్షలతో నిర్మించే మహిళ సమైక్య భవనాలకు భూమిపూజ చేశారు. సర్పంచులు అంకతి మల్లయ్య, గంగోత్రి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరందన్, డీఈ మిలింద్, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు.
కోర్టుకు సదుపాయాలు కల్పిస్తా
జగిత్యాలజోన్: జిల్లా కోర్టుకు సదుపాయాలను కల్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల బార్ అసోసియేషన్తో సమావేశమయ్యారు. కోర్టులో లిఫ్ట్, అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఐఎంఏలో అవగాహన
ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ‘లీగల్ లిటరసీ ఫర్ డాక్టర్స్ ప్రోటెక్టింగ్ ప్రాక్టీస్ అండ్ పేషంట్స్’ అనే అంశంపై న్యాయవాది గొనెపట్ల అజయ్ రెడ్డి ప్రసంగించారు. న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు రికార్డులు వైద్యుడికి సంరక్షణగా నిలుస్తాయన్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.హేమంత్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కె.సుధీర్కుమార్ పాల్గొన్నారు.


