
‘ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ’ పర్యటన
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్ భూములను ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు శుక్రవారం పర్యటించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని వారు సందర్శించారు. గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని రైల్వేట్రాక్, రాజీవ్ రోడ్డు కనెక్టివిటీ, ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి బసంత్నగర్ ఎయిర్పోర్టు భూములు పరిశీలించారు. అయితే, ఎయిర్పోర్టు నిర్మాణం ఎంతోఅవసరం కాగా, అంతర్గాం, బసంత్నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతోపాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ ఏడీఈ శ్రీనివాస్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్పటేల్ తదితరులు ఉన్నారు.