
బాలికలదే పైచేయి
● ఇంటర్ ఫస్టియర్లో 68శాతం పాసైన బాలికలు ● 39శాతంతో బాలుర ఉత్తీర్ణత ● సెకండియర్లో 54.9 శాతం బాలురు.. ● 78.58 శాతంతో బాలికలు అగ్రస్థానం ● జిల్లాకు ఫస్టియిర్లో 24.. సెకండియర్లో 18వ స్థానం
జగిత్యాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్లో జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలువగా.. ఫస్టియర్ ఫలితాల్లో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 73 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 మోడల్స్కూళ్లు, ఏడు కేజీబీవీ, ఐదు సోషల్ రెసిడెన్సీలు, ఐదు మైనార్టీ రెసిడెన్షియల్స్ 5, రెండు బీ సీ రెసిడెన్షియల్స్, ఐదు టీఎస్డబ్ల్యూఆర్సీజేసీ, 21 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
ప్రథమ సంవత్సరంలో..
జిల్లాలో మొదటి సంవత్సరం 2,554 మంది బాలురు పరీక్షలు రాయగా కేవలం 996 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 39శాతంగా నమోదైంది. బాలికలు 3,550 పరీక్ష రాయగా.. 2,443 మంది ఉత్తీర్ణతతో 68.82 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2,233 బాలురు రాయగా.. 1226 మంది ఉత్తీర్ణతతో 54.9 శాతం సాధించారు. బాలికలు 3,137 పరీక్ష రాసి 2,465 మంది పాసై 78.58 శాతం నమోదు చేశారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్లో బాలురు 570 మంది రాసి 178 మంది పాసయ్యారు. 399 బాలికలు పరీక్ష రాసి 273 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్లో 454 బాలురు పరీక్ష రాయగా 226 మంది పాసయ్యారు. 349 బాలికలు పరీక్షరాసి 303 మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య
ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంపై వారిని అభినందించారు. పేద విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో పోటీపడుతూ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. సీఈసీ సెకండియర్లో మానుపాటి వర్ష 971, గ్రీష్మ 928, ఫస్టియర్ ఎంపీసీలో సానియామీర్జా 465, బైపీసీలో నజాలియ నస్ర 430 మార్కులు సాధించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, అధ్యాపకులు కొట్టాల తిరుపతిరెడ్డి, రాజయ్య, సునీత, శ్రీలత, శిల్ప, మాధవి పాల్గొన్నారు.
మే 22 నుంచి సప్లిమెంటరీ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలిచిందని ఇంటర్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఫస్టియర్లో 4.65శాతం, సెకండియర్లో 4.4శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం మే 22నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా.. రీకౌంటింగ్.. రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30లోపు ఫీజు చెల్లించి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. జవాబు ప్రతిని కూడా పొందవచ్చని సూచించారు.