
విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు
● రావెప్కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక
● రైతులతోనే నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయి పాఠాలు
● భౌగోళిక స్వరూపం, ప్రదర్శనల రూపకల్పన
కరీంనగర్ అర్బన్: అవును.. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతర్జాలం ద్వారా అందే సేవలను వివరించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను రూపొందించనుండగా గ్రామ భౌగోళిక స్వరూపాన్ని డయాగ్రామ్ ద్వారా నివేదించనున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (రావెప్)లో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు నాలుగు నెలలపాటు గ్రామాల్లోనే బస చేయనున్నారు. కరీంనగర్ ఏరువాక ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా ఇప్పటికే విద్యార్థులు రైతులతో మమేకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కళాశాలకు చెందిన మొత్తం 21మంది విద్యార్థులకు గానూ 4–5గురు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేసి, మండలానికో గ్రామం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండ గ్రామాల్లో క్షేత్రస్థాయి అనుభవాలను గడిస్తున్నారు. జూన్ వరకు కార్యక్రమాల నిర్వహణతో పాటు అనుభవాలను పొందనున్నారని కరీంనగర్ ఏరువాక సమన్వయకర్త డా.మదన్మోహన్రెడ్డి వివరించారు.
యూట్యూబ్, టోల్ఫ్రీ సేవలపై ప్రచారం
రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా అంతర్జాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఎప్పకటిప్పటి సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామీణ విశ్లేషణాత్మక తులనం(పీఆర్ఏ)లో భాగంగా సోషల్ మ్యాప్ వేసి గ్రామంలో ఉన్న భౌగోళిక వివరాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, ఇతరత్రా వివరాలను రూపొందించనున్నారు. యూట్యూబ్ ఛానల్ ‘పీజేటీఎస్ఎయూ’లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోలు ఉండనుండగా అథెంటిక్గా రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు చూసుకోవచ్చు. రైతుల విజయగాథలు ఉండనుండగా నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుములు, అపరాలు, తృణధాన్యాలపై వీడియోలు ఉండనున్నాయి. కిసాన్ సారథి టోల్ఫ్రీ నంబర్ 14426 లేదా 18001232175 ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను వివరిస్తే పరిష్కారం చూపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలందనుండగా రైతులు ఫోన్ చేస్తే ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు లైన్లోకి రానున్నారు. ఇక వ్యవసాయ యూనివర్శిటీలు రూపొందించిన విత్తనాలను రైతుల క్షేత్రాల్లో ప్రాక్టికల్గా పరీక్షించనున్నారు.
విత్తు నుంచి కోత వరకు సేవలు
ఒక్కో విద్యార్థినికి ఒక్కో రైతును అటాచ్ చేయగా వివిధ రకాల విత్తనాలు వేసిన నుంచి పంట కోత వరకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో పాటు పంటలకు ఆశించే చీడపీడల నివారణ, దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకు అనుసరించిన యజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల సూచనల క్రమంలో ఫీల్డ్లో అమలు చేయనున్నారు. ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల వినియోగం పొదుపుగా జరిగేలా సూచనలు చేయనున్నారు. అలాగే ఏ గ్రామంలో సేవలందిస్తున్నారో ఆ గ్రామ నైసర్గిక స్వరూపంతో పాటు వనరులను వివరిస్తూ డయాగ్రామ్ రూపొందించనున్నారు.
నాలుగు నెలల పాటు సేవలు
మాది సిద్దిపేట. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో అగ్రి కల్చర్ లాస్ట్ ఇయర్ చదువుతున్న. వ్యవసాయ విద్యార్థులకు తరగతి బోధనలతో పాటు ప్రాక్టీకల్ అవగాహన అవసరం. అందుకే నాలుగు నెలల పాటు పంట పొలాలు, రైతుల మధ్య తిరుగుతూ నివేదికలు, మ్యాప్లు రూపొందించాల్సి ఉంటుంది.
– పి.స్పందన, ఆగ్రికల్చర్ విద్యార్థి, సిద్దిపేట

విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు