యుద్ధం అంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి యుద్ధం వెనుక మరో ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ఒకవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, మరోవైపు కొన్ని రంగాలు మాత్రం భారీగా లాభపడతాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు ఎక్కువ లాభం పొందారు? ఎవరు నష్టపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరాన్-అమెరికా యుద్ధం కేవలం రణరంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపింది. యుద్ధం తొలి నాలుగు రోజుల్లోనే అమెరికా నేతృత్వంలోని కూటమి 5,000కు పైగా ఆయుధాలు వినియోగించింది. మొత్తం యుద్ధ వ్యయం 35-40 బిలియన్ డాలర్ల వరకు చేరి ఉండొచ్చని అంచనా.
యుద్ధం వల్ల లాభం పొందినవారు
ఆయుధాల తయారీ సంస్థలు
టోమాహాక్ క్షిపణులు, పెట్రియట్ క్షిపణుల తయారీ కంపెనీలు
ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతి సంస్థలు
ముడి చమురు వ్యాపార సంస్థలు
యుద్ధ పరిణామాలపై పందేలు కాసిన కొందరు పెట్టుబడిదారులు
మరోవైపు రష్యా, చైనా దేశాలు కూడా భౌగోళిక రాజకీయాల పరంగా ప్రయోజనాలు పొందాయి. అయితే యుద్ధ భారం మాత్రం సాధారణ ప్రజలపై పడింది. ఇంధన ధరల పెరుగుదలతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ఇలా కాల్పుల మోతలో కాసుల వర్షం..!
యుద్ధంలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో వాటి తయారీ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టోమాహాక్ క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉండటంతో ఆయుధ పరిశ్రమకు భారీ ఆదాయం లభించింది. పెరిగిన డిమాండ్ వల్ల తయారీ సమయం కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెరిగింది.
ఇరాన్ తక్కువ ధర కలిగిన షాహెద్ డ్రోన్లను వినియోగించగా, వాటిని కూల్చేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పెట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో దాడులు చేసిన ఇరాన్కు ఎదురుగా అమెరికా అత్యధిక వ్యయం చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయుధ తయారీ సంస్థల అమ్మకాలు, ఆర్డర్లు, వాటాల విలువలు వేగంగా పెరిగాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు ఈ పరిణామాలతో భారీ లాభాలు పొందాయి.
హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి అమెరికా గ్యాస్ ఎగుమతి సంస్థలకు అనుకూలంగా మారింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగడంతో అమెరికా నుంచి గ్యాస్ ఎగుమతి చేసే సంస్థలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి.
ముడి చమురు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చమురు వ్యాపార సంస్థలు, వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించారు. కొంతమంది సంస్థలకు యుద్ధం వల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురైనా, పెరిగిన ధరల కారణంగా గత ఎన్నో సంవత్సరాల్లో లేనంత లాభాలు నమోదయ్యాయి.
యుద్ధం సమయంలో అమెరికా గల్ఫ్ దేశాలకు భారీ విలువైన ఆయుధాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రక్షణ వ్యయాన్ని మరింత పెంచే ప్రణాళికలూ ప్రకటించింది. ఈ వ్యయ భారం చివరకు అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే అవకాశం ఉంది.
ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశంగా ప్రిడిక్షన్ మార్కెట్. యుద్ధం, కాల్పుల విరమణ వంటి పరిణామాలపై ముందుగానే పందేలు కాసి కొందరు కోట్ల డాలర్ల లాభాలు పొందినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీనిపై అమెరికా సెనెట్ దర్యాప్తునకు ఆదేశించింది.
మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో అత్యధిక లాభం ఆయుధ తయారీ సంస్థలు, గ్యాస్ ఎగుమతిదారులు, చమురు వ్యాపారులు పొందారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ప్రజలు అధిక గ్యాస్ ధరల భారం భరించాల్సి వచ్చింది. తక్కువ ధర డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన క్షిపణులు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడింది.


