క్రిమియా సహా డజను ప్రాంతాల్లో భీకర పేలుళ్లు
కీవ్: ఉక్రెయిన్ మరోసారి తన లాంగ్రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపింది. ఆక్రమిత క్రిమియా సహా డజనుకు పైగా ప్రాంతాల్లో గురువారం రాత్రి భీకర దాడులకు పాల్పడింది. నాలుగేళ్ల క్రితం రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఉక్రెయిన్ చేపట్టిన భారీ దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. వాటిల్లిన నష్టాన్ని అధికారికంగా రష్యా ప్రకటించనప్పటికీ, స్వతంత్ర వార్తా సంస్థలు మాత్రం నొవొమొస్కోవ్స్క్ లోని రసాయన కర్మాగారం, జలవిద్యుత్ ప్లాంట్లలో పేలుళ్లు సంభవించినట్లు తెలిపాయి.
క్రిమియాలోని కీలకమైన నౌకాశ్రయం కెర్చ్లోని గగనతల రక్షణ వ్యవస్థలతోపాటు రష్యా యుద్ధ నౌకలపై డ్రోన్ దాడి జరిపినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. దాడులతో నౌకల్లో భారీగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. రాజధాని మాస్కో దిశగా దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేశామని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమైన 660 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
జెలెన్స్కీ 40 రోజుల ఆపరేషన్
శాంతి చర్చల దిశగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన 40 రోజుల ఆపరేషన్ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యాపై డ్రోన్ దండును వదలడం గమనార్హం. రష్యా లోతట్లు ప్రాంతాల్లో ఉన్న ఇంధన, చమురు కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులు తీవ్ర ప్రభావం చూపాయి.


