breaking news
chemical plant blast
-
రష్యాపై భారీ డ్రోన్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ మరోసారి తన లాంగ్రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపింది. ఆక్రమిత క్రిమియా సహా డజనుకు పైగా ప్రాంతాల్లో గురువారం రాత్రి భీకర దాడులకు పాల్పడింది. నాలుగేళ్ల క్రితం రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఉక్రెయిన్ చేపట్టిన భారీ దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. వాటిల్లిన నష్టాన్ని అధికారికంగా రష్యా ప్రకటించనప్పటికీ, స్వతంత్ర వార్తా సంస్థలు మాత్రం నొవొమొస్కోవ్స్క్ లోని రసాయన కర్మాగారం, జలవిద్యుత్ ప్లాంట్లలో పేలుళ్లు సంభవించినట్లు తెలిపాయి. క్రిమియాలోని కీలకమైన నౌకాశ్రయం కెర్చ్లోని గగనతల రక్షణ వ్యవస్థలతోపాటు రష్యా యుద్ధ నౌకలపై డ్రోన్ దాడి జరిపినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. దాడులతో నౌకల్లో భారీగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. రాజధాని మాస్కో దిశగా దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేశామని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమైన 660 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. జెలెన్స్కీ 40 రోజుల ఆపరేషన్ శాంతి చర్చల దిశగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన 40 రోజుల ఆపరేషన్ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యాపై డ్రోన్ దండును వదలడం గమనార్హం. రష్యా లోతట్లు ప్రాంతాల్లో ఉన్న ఇంధన, చమురు కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. -
చైనాలో భారీ పేలుడు.. 44 మంది మృతి
బీజింగ్ : చైనాలోని జియాంగ్జు ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. యాంచెంగ్లోని టియాంజాయి కెమికల్ ప్లాంట్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా.. సుమారు 640 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. పేలుడు తీవ్రతకు కెమికల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం వల్లే పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, గతంలో కూడా ఈ విషయంలో కంపెనీకి జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతుందన్నారు. -
రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు
జర్మనీలోని బీఏఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోగల ఓ రసాయనాల ఫ్యాక్టీరలో పేలుడు సంభవించడంతో ఒక వ్యక్తి మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికులు అందరినీ ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పైప్లైన్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. చాలామందికి గాయాలయ్యాయని, కొందరు గల్లంతయ్యారని బీఏఎస్ఎఫ్ తెలిపింది. రైన్ నది ఒడ్డున ఉన్న ఒక రేవులో భారీ పారిశ్రామిక ప్రాంగణం ఉంది. అక్కడే ప్రమాదం జరగడంతో.. భారీ ఎత్తున మంటలు, పొగలు కమ్ముకున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో కూడా ఇంకా అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సమీపంలోని రోడ్లను పోలీసులు మూసేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు అందరూ ఇళ్లలోనే ఉండాలని, తలుపులు.. కిటికీలు మూసేసుకోవాలని అధికారులు ప్రకటించారు. పాఠశాలలు మూసేశారు. ప్రమాదానికి కారణాలేంటో తాము దర్యాప్తు చేస్తున్నామని, సంబంధిత అధికారులకు తెలిపామని బీఏఎస్ఎఫ్ వివరించింది. లడ్విగ్ఫాఫెన్ నగరంలో 1.60 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఇది ఫ్రాంక్ఫర్ట్ నగరానికి నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.


