USA: న్యూ ఇయర్‌ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు | Shamsuddin Jabbar Truck Rams Crowd In US New Orleans Details, Watch Video Inside | Sakshi
Sakshi News home page

USA: న్యూ ఇయర్‌ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు

Jan 2 2025 8:03 AM | Updated on Jan 2 2025 8:42 AM

 Shamsuddin Jabbar Truck Rams Crowd In US New Orleans Details

వాషింగ్టన్‌: కొత్త ఏడాది వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు కారణమైన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు.  ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూ ఆర్లీన్స్‌లో పికప్‌ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్‌ జబ్బార్‌(42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్‌ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్‌ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు మిలిటరీలోనూ సేవలు అందించాడు. అయితే, ఆర్థిక కారణాలు ఎదుర్కొంటున్న జబ్బార్‌కు భార్యతో విడాకులు అయ్యాయి. కాగా, ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్‌ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. దీంతో, ఈ ఘటన టెర్రరిస్ట్‌ల పన్నాగమేనని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూఆర్లీన్స్‌లోని బార్బన్‌ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో జబ్బార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

 బైడెన్‌ సంతాపం..
ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement