ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి
మరో 100 మందికిపైగా తీవ్ర గాయాలు
కీవ్, నీప్రో నగరాల్లో కుప్పకూలిన అపార్టుమెంట్లు
సైనిక లక్ష్యాలను ఛేదించామన్న రష్యా
కీవ్: రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా మరోసారి డజన్ల కొద్దీ క్షిపణులు, వందలాది డ్రోన్లతో చెలరేగిపో యింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగిన ఈ దాడులతో నివాస భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇద్దరు చిన్నారులు సహా కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. కీవ్ లో డజనుకు పైగా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగాయి. దాడు ల్లో ఐదు ఆస్పత్రులు, పలు నివాస భవనా లు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నా యి. శిథిలాల్లో కూరుకుపోయిన ప్రజలను కాపాడేందుకు అగ్ని మాపక, సహాయక సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్లో రాత్రంతా సైరన్లు మోగుతూనే ఉన్నా యి.
అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో 41 వేల మందికి పైగా తలదాచుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇంతమంది మెట్రో రైల్వే స్టేషన్లలో ఆశ్రయం పొందడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. తీవ్రస్థాయిలో గగనతల దాడులకు పాల్పడతాం, కీవ్ను విడిచి వెళ్లిపొమ్మంటూ కొన్ని రోజుల క్రితం రష్యా చేసిన హెచ్చరికలను విదేశీ దౌత్యాధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. భవన శిథిలాల్లో చిక్కుకుని కీవ్లో ఆరుగురు చనిపోగా, 67 మంది వరకు గాయపడినట్లు ఎమర్జెన్సీ సిబ్బంది తెలిపారు. నీప్రోలో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా ప్రయోగించిన 73 మిస్సైళ్లు, 656 డ్రోన్లకుగాను 40 క్షిపణులు, 602 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
ప్రధానంగా కీవ్, నీప్రోలతోపాటు పొల్టావా, ఖర్కీవ్, జపొరిఝియాలపైనే రష్యా దాడులు జరిగాయంది. కాగా, సైనిక పరిశ్రమ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. కనీసం 30 బాలిస్టిక్ మిస్సైళ్లు, 3 క్రూయిజ్ మిస్సైళ్లు, 33 డ్రోన్లు 38 ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించాయంది. రష్యా ఆక్రమిత లుహాన్స్క్లోని కాలేజీ హాస్టల్పై మే 22వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇందుకుగాను ఉక్రెయిన్పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని మంగళవారం అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం గమనార్హం. యుద్ధక్షేత్రంలో రష్యా సరఫరా వ్యవస్థలను ఉక్రెయిన్ డ్రోన్లు చిందరవందర చేయడం, కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు వసతులను ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీయడంతో నిస్పృహతోనే అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. మే మొదటివారంలో రష్యా ఇదే రీతిన చేపట్టిన దాడుల్లో కనీసం 21 మంది చనిపోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.


