Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ.. మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే.
దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు విక్రమ సింఘే. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి.
ఇదీ చదవండి: శ్రీలంక ఆందోళనలకు 100 రోజులు.. సమస్య సద్దుమణిగేనా?
సంబంధిత వార్తలు