న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలను “దోషులు” అని ప్రధాని మోదీ అన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం వైఖరిని ఆయన తప్పు అని పేర్కొని, భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాగా, లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు 230 మంది విపక్ష సభ్యులు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. విపక్షాలు మాత్రం బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని అంటున్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ శనివారం బీజేపీ మహిళా నేతలు నిరసనలు తెలుపుతునున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అవకాశం ఉంది.


