
కొలంబియా రాజధాని బొగొటాలోని ప్రఖ్యాత శాంటా మారియా ప్లాజాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది యోగ సాధకులు, ఔత్సాహికులు పాల్గొన్న ఈ వేడుకకు ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా హాజరయ్యారు. సరిగ్గా ఒక దశాబ్దం కిందట కొలంబియా ప్రభుత్వం, తీవ్రవాద ఫార్క్ గెరిల్లా సంఘాలు శాంతి ఒప్పందం చేసుకోవటంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.
ఆ విధంగా దశాబ్దాలపాటు కొనసాగిన తీవ్రవాద సాయుధ సంఘర్షణకు స్వస్తి చెప్పి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ సంవత్సరపు యోగా దినోత్సవ వేడుకలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది కొలంబియాలో శాంతి దశాబ్దానికి గుర్తుగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రసంగించిన గురుదేవ్, యోగాను కేవలం శారీరక వ్యాయామంగా మాత్రమే అనుకోవద్దని, అది మన మానసిక స్థితిని సైతం మార్చగలదని గుర్తు చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన యోగా దినోత్సవపు కార్యాచరణను రూపొందించటం గురించి మాట్లాడుతూ, మొట్టమొదటి కామన్ యోగా ప్రోటోకాల్ ను రూపొందించిన కమిటీకి తానుఅధ్యక్షత వహించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. “ప్రపంచ జనాభాలో మూడు వంతులకు పైగా ప్రజలు ఈ ప్రోటోకాల్ను అనుసరిస్తుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మానసిక ఆరోగ్య రంగంలో మన పని ఇక్కడితో ఆగదు. ఇది వాస్తవానికి ఆరంభం మాత్రమే.” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగోటా కల్చరల్ సెక్రటేరియట్కి చెందిన ఆబ్జర్వేటరీ ఆఫ్ కల్చర్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, “గత కొన్ని వారాలుగా దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది, ఆ ఉద్రిక్తతలను చల్లార్చి, సమతుల్యం తీసుకురావడానికి, బొగోటా దేశ ప్రజలందరికీ ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చేందుకు ఈనాడు సరైన సమయం వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.
2015వ సంవత్సరంలో, కొలంబియాలో శాంతిస్థాపన ఇక అసాధ్యమని చాలామంది అనుకున్న సమయంలో దానిని గురుదేవ్ సాధించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు ఫార్క్ (FARC) తిరుగుబాటుదారులు, కొలంబియా ప్రభుత్వం మధ్య జరిగిన ఉద్రిక్తతలు, ఘర్షణలు కొనసాగాయి. అనేక శాంతి ఒప్పందాలు విఫలమై, అవిశ్వాసపు అగాధం ఇరువర్గాలలో నెలకొన్న ఆ తరుణంలో గురుదేవ్ ఫార్క్ కమాండర్లతో మూడు రోజుల మధ్యవర్తిత్వ చర్చలు నిర్వహించారు. అహింసను ఆయుధంగా స్వీకరించమని, దేశ భవిష్యత్తు కోసం విస్తృత దృక్పథంతో చర్చలను అంగీకరించమని వారిని కోరారు. ఆయన చొరవతో సంక్షోభానికి పరిష్కారం లభించింది. ఒక సంవత్సరం పాటు సంపూర్ణ కాల్పుల విరమణ ను ఫార్క్ ప్రకటించింది —అభూతపూర్వమైన ఈ చర్య తరువాతి శాంతి ఒప్పందానికి మార్గాన్ని సిద్ధం చేసింది.
పది సంవత్సరాల తరువాత, ఈరోజున గురుదేవ్ మళ్లీ కొలంబియాను సందర్శించారు. కేవలం దశాబ్ది ఉత్సవాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాక, మరింత శాంతియుతంగా, ఐక్యతతో కూడిన దక్షిణ అమెరికాను సాధించే దిశగా వారు తమ దృష్టిని సారించారు. బొగోటా, మెడెలిన్, కార్టాజెనా వంటి నగరాల్లో, ఆయన కొలంబియా పార్లమెంట్ సభ్యులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను కలుసుకుని, వారికి ధ్యానపు లోతైన అనుభూతిని పరిచయం చేశారు. కొలంబియా పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ గురుదేవ్, “కష్టాలనుండి విముక్తమైన ప్రపంచం, మరింత ప్రేమభరితమైన, ఆనందంగా, శాంతితో నిండిన ప్రపంచం అనేది ఇది ఊహా ప్రపంచంలా అనిపించవచ్చు. అది ఒక కలగానే ప్రారంభమవుతుంది. మనం ఈ కలను కనటం ప్రారంభిస్తే, దాన్ని తప్పక నిజం చేయగలమని నేను నమ్ముతున్నాను.” అని అన్నారు.
అంతకు ముందు జూన్ 20వ తేదీన, సమాజ నిర్మాణంలో గురుదేవ్ చూపిన శ్రద్ధ, నిబద్ధత, ఇంకా స్ఫూర్తివంతమైన, నిరంతర సేవలకు గుర్తింపుగా కార్టాజెనా డే ఇండియాస్ నగర మేయర్ డుమెక్ టుర్బే పాజ్ శ్రీశ్రీ ని *బొలీవార్ గవర్నరేట్ మెడల్ తో సత్కరించి, ప్రపంచంలో శాంతి, ఆనందాలను ప్రోత్సహించడంలో గురుదేవుల పాత్రను శ్లాఘించారు.
2016లో న్యూఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ కల్చర్ ఫెస్టివల్కు హాజరైన చిత్రదర్శకురాలు మరియు ఫోటోగ్రాఫర్ లికా గవీష్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “నా భాగస్వామి ఒక కేమెరామన్గా ఘర్షణ ప్రాంతాల్లో పనిచేశాడు. అక్కడి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో నాకు బాగా తెలుసు. అటువంటి ప్రాంతానికి శాంతిని తీసుకురావడంలో గురుదేవ్ పాత్ర పోషించారన్న విషయం నన్ను బాగా కదిలించింది. ప్రపంచం ఆయనకు ఎంతో ఋణపడి ఉంటుంది.” అని ఉద్వేగ భరితంగా గుర్తుచేసుకున్నారు.