Pakistan MP Aamir Liaquat Death: పాకిస్థాన్ ఎంపీ ఆకస్మిక మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం ఇంట్లో కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెద్యులు పేర్కొన్నారు. లియాఖత్ మరణవార్త తెలియగానే పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రాజా పర్వైజ్ అష్రఫ్ సభను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు.
కాగా హుస్సేన్ ముత్తాహిదా ఖౌమీ ఉద్యమంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో మొదటిసారిగా పాకిస్థాన్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. హుస్సేన్ రాజకీయవేత్తగానే కాకుండా కాలమిస్ట్, టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడిగా కూడా సుపరిచితుడే.
అమిర్ లియాఖత్ హుస్సేన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 18 ఏళ్ల యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన నెలకే ఆమె అతన్ని విడిచి వెళ్లిపోయింది. లియాఖత్ మత్తుకు బానిస అని, తనను కొట్టేవాడిని ఆరోపణలు చేసింది.
చదవండి: రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్ సంభాషణ లీక్!