భారత్‌పై కన్నేసిన పాక్‌.. అసలు లక్ష్యమేంటి? | Pakistan has launched 6 satellites in 16 months tracking India | Sakshi
Sakshi News home page

భారత్‌పై కన్నేసిన పాక్‌.. అసలు లక్ష్యమేంటి?

Jun 10 2026 7:52 AM | Updated on Jun 10 2026 9:04 AM

Pakistan has launched 6 satellites in 16 months tracking India

భారత్‌ టార్గెట్‌గా దాయాది దేశం పాకిస్తాన్‌ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గత 16 నెలల కాలంలో వరుసగా ఆరు భూ పరిశీలన (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కాగా, పాక్‌ చర్యలు దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవినియోగ మ్యాపింగ్ వంటి పౌర అవసరాల కోసం అని పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ నిపుణులు ఇవి సైనిక నిఘా సామర్థ్యాన్ని కూడా పెంచగలవని విశ్లేషిస్తున్నారు.

వేగంగా పాకిస్తాన్ అంతరిక్ష విస్తరణ.. 
గతంలో పరిమిత స్థాయిలో ఉన్న పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా సాంకేతిక సహకారంతో భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో పాకిస్తాన్ కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల్లో PRSC-EO1, PRSC-EO2, PRSC-EO3 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి ఉపరితల చిత్రాలను సేకరించి విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే, భూ పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉపరితల చిత్రాలు, భౌగోళిక సమాచారం, వాతావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేస్తాయి. భద్రతా మరియు సరిహద్దు పర్యవేక్షణ కూడా చేయనున్నాయి. ఇక, అధునాతన సెన్సర్లు కలిగిన ఉపగ్రహాలు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, వాహనాల కదలికలు వంటి అంశాలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

భారత్‌ను గమనించే సామర్థ్యం ఎంత?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలు భారత భూభాగం మీదుగా ప్రయాణించే సమయంలో చిత్రాలను సేకరించగలవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, వాయుసేన కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను గుర్తించే అవకాశం ఉంది. ఇలా ఆయా ప్రాంతాలపై సమాచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఉపగ్రహాలు 24 గంటలూ ఒకే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా గమనించవు. అవి కక్ష్యలో తిరుగుతాయి. కాబట్టి ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట వ్యవధుల్లో మాత్రమే చిత్రీకరించగలవు. అంతేకాకుండా.. భారత్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ విస్తీర్ణం సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆరు ఉపగ్రహాలు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినా, మొత్తం దేశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అసాధ్యం.

సన్-సింక్రోనస్ కక్ష్య ప్రయోజనం
పాకిస్తాన్ తాజా ఉపగ్రహాల్లో చాలా వరకు సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కక్ష్య ప్రత్యేకతలు ఏంటంటే.. ప్రతిరోజూ ఒకే ప్రాంతాన్ని దాదాపు ఒకే సమయానికి చిత్రీకరించగలదు. భూమిపై మార్పులను పోల్చి చూడటం సులభం. సైనిక నిఘా, మ్యాపింగ్, పర్యావరణ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది.

భారత్‌, పాక్‌ మధ్యలో చైనా..
పాకిస్తాన్‌, చైనా మధ్య అంతరిక్ష సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. పాకిస్తాన్‌కు చైనా ఉపగ్రహ సాంకేతికత, శిక్షణ, డేటా ప్రాసెసింగ్ మద్దతు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సొంత అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. మరోవైపు. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు, వ్యూహాత్మక నిఘా ఉపగ్రహాలు వంటి విస్తృత సామర్థ్యాలను అభివృద్ధి చేసింది. అదనంగా భారత్ తన సరిహద్దుల పర్యవేక్షణ కోసం మరింత పెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ భద్రతా అవసరాల కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

భవిష్యత్తు యుద్ధాల్లో ఉపగ్రహాల పాత్ర
ప్రస్తుతం యుద్ధాలు కేవలం సైనికులపై ఆధారపడటం లేదు. టెక్నాలజీపై ఆధారపడి దాడులు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో కూడా ఉపగ్రహ సమాచారానికి అత్యంత ప్రాధాన్యం లభించింది.

ఉపగ్రహాలతో ఇలా..

  • క్షిపణుల మార్గదర్శనం

  • డ్రోన్ కార్యకలాపాలు

  • కమ్యూనికేషన్

  • నావిగేషన్

  • లక్ష్యం గుర్తింపు

  • గూఢచారి సమాచారం వంటి పనుల్లో కీలకం.

Advertisement
 
Advertisement
Advertisement