సౌర తుఫాన్లు, గాలుల వల్లే ఆయస్కాంత శక్తి మటుమాయం
దాంతో మార్స్పై నీరు, వాతావరణం కనుమరుగు: నాసా
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు.
బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది.
చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది.
ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్