సర్ప్రైజ్ చేసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్! అల్లకల్లోలం వేళ..
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఎవరూ ఊహించని పని చేశాడు. పొరుగు దేశం దక్షిణ కొరియాతో సరిహద్దులో అల్లకల్లోలం నెలకొన్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జాయ్ఇన్కు మెచ్చుకుంటూ ఓ లేఖ రాశాడు. దాయాది దేశాలుగా ప్రపంచంలో దృష్టిలో పేరుబడ్డ దేశాల మధ్య.. అదీ కిమ్ తరపున ఈ ఘటన జరగడం నిజంగా విశేషమే!. అయితే..
కిమ్ ఈ పని చేయడానికి ఓ కారణం అంటూ ఉంది. మూన్ జాయ్ఇన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ తరుణంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. ఉత్తర కొరియా కిమ్ ప్రశంసా లేఖ పంపించాడు. 2018లో ఈ ఇద్దరి మధ్య మూడు భేటీలు జరిగాయి. ఆ ప్రభావమే సరిహద్దులో మిలిటరీ ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టాయి.
కానీ, అమెరికా జోక్యంతో ఆ తర్వాత ఆ ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయి చేరాయి. ఇదిలా ఉండగా.. పదవి నుంచి దిగిపోయాక కూడా కొరియా దేశాల మధ్య చర్చల కోసం మూన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు కిమ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే అంతకుముందు మూన్ నుంచి కిమ్ జోంగ్ ఉన్కు కూడా ఓ లేఖ అందిందని, ప్రతిగానే కిమ్ ఈ లేఖ పంపించాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అస్సలు బాగోలేవు. సరిహద్దులో క్షిపణి పరీక్షలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తేడాలొస్తే.. అణ్వాయుధాలు సైతం ప్రయోగిస్తామని ఉత్తర కొరియా నుంచి సౌత్ కొరియాకు వార్నింగ్లూ వచ్చాయి. అలాంటి వేళ.. ఈ పరస్పర లేఖల ప్రశంసల పర్వం కొనసాగడం గమనార్హం.
చదవండి: కిమ్ సంచలన నిర్ణయం