
టెలీ అవీవ్: ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్తో యుద్ధం కారణంగా వాయిదా పడింది.