
న్యూహాంప్షైర్: అమెరికాలోని మెయిన్ రాష్ట్రానికి చెందిన ఓ బామ్మ ఎట్టకేలకు డిగ్రీ పట్టా అందుకున్నారు. వాస్తవానికి ఈమెకీ పట్టా 1959 లోనే అందాల్సి ఉంది. అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. కుమార్తె చొరవ తో దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈమె కల నిజమైంది. న్యూహాంప్షైర్కు చెందిన జోన్ అలెగ్జాండర్(88) సాధించిన ఘనత ఇది. ఈమె మెయిన్ యూనివర్సిటీలో సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో 1950ల్లో చేరారు.
1959 కల్లా ఈ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంది. పట్టా చేతికి రావాలంటే కోర్సు చివర్లో విద్యారి్థనీ విద్యార్థులు కొద్దికాలంపాటు ఉపాధ్యాయులుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అప్పటికి గర్భవతిగా ఉన్న జోన్ను అధికారులు బోధించేందుకు అనుమతించలేదు. ఆ రోజుల్లో జోన్ వంటి వారందరిదీ ఇదే పరిస్థితి. దీంతో, డిగ్రీ పట్టాను అందుకోవాలన్న జోన్ కల అలాగే మిగిలిపోయింది.
కుమార్తె సాయంతో..
ఈ ఏడాది ఆరంభంలో జోన్ అలెగ్జాండర్ కుమార్తె ట్రేసీ తల్లి కలను నిజం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మెయిన్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ విభాగం అసోసియేట్ డీన్గా ఉన్న జస్టిన్ డిమ్మెల్ సానుకూలంగా స్పందించారు. జోన్ అలెగ్జాండర్కు సంబంధించిన విద్యార్హతల వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. 1980ల్లో ఆమె ఓ ప్రీసూ్కల్లో పూర్తిస్థాయి సహాయకురాలిగా పనిచేసినట్లుగా గుర్తించారు.
ఈ అనుభవాన్ని బోధనతో సమానమైన అర్హతగా భావించి, జోన్ అలెగ్జాండర్కు డిగ్రీ పట్టా ప్రదానం చేసేందుకు వర్సిటీ యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది మేలో జోన్ అలెగ్జాండర్ను గ్రాడ్యుయేట్గా గుర్తిస్తున్నట్లు మెయిన్ వర్సిటీ ప్రకటించింది. మే 11వ తేదీన జరిగిన స్నాతకోత్సవానికి జోన్ వెళ్లలేకపోయారు. బదులుగా ఆమె కుమార్తె ట్రేసీ, మనవరాలు ఇసాబెల్ వర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా జోన్ అలెగ్జాండర్ పేరును ప్రస్తావించారు. విద్యారంగానికి జీవితాన్ని అంకితం చేసిన జోన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. చిట్టచివరికి తన కృషిని గుర్తించడం ఎంతో ముఖ్యమైన అంశమని జోన్ పేర్కొన్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. స్నాతకోత్సవంలో తల్లి తరఫున పట్టా అందుకున్న వేళ ఎంతో ఉద్వేగానికి గురైనట్లు ట్రేసీ పేర్కొన్నారు. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరూ ఎంతో మద్దతిచ్చారన్నారు.
కాగా, జోనీ అలెగ్జాండర్ భర్త తీర రక్షక దళం అధికారి. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. భర్త ఎక్కువ సమయంలో విధుల్లో ఉండాల్సి రావడంతో నలుగురు కూతుళ్ల భారం జోనీయే మోశారు. న్యూ హాంప్షైర్లోనే ఉంటున్న జోనీ ఇప్పటికీ చర్చి, స్థానిక లైబ్రరీ, స్కూళ్లలో జరిగే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘డిగ్రీ సంపాదించడం నా వ్యక్తిగత లక్ష్యం. మా కుటుంబంలోని వారంతా గ్రాడ్యుయేట్లే. ఎట్టకేలకు నేను సైతం గ్రాడ్యుయేట్నయ్యా’అని గర్వంగా చెప్పుకుంటున్నారు జోనీ అలెగ్జాండర్..!