
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత
కేయూ క్యాంపస్ : మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్, హనుమకొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ‘అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ అని, క్షణికానందం కోసం యువత తప్పటడుగు వేయొద్దన్నారు. మత్తు పదార్థాలతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ, దేశంపై ప్రభావం ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభి రామారావు మాట్లాడుతూ భావిభారత యువత మత్తు పదార్థాలపై యుద్ధం చేయాలన్నారు. అవగాహనతో శారీకక, మానసిక ఆరోగ్యం పొందొచ్చని, తద్వారా ఏదైనా సాధించొచ్చన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ డ్రగ్స్కు జీవితాన్ని బానిస చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ డ్రగ్స్’, ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండే, పాలకమండలి సభ్యురాలు కె.అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ ప్రతాప్రెడ్డి