
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. తక్కువ వయస్సున్న పిల్ల లను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించేందుకు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ ఉన్నారు. అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరగా.. వారి పేర్లు వెల్లడించకపోవడంతో విచారణ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ మూలాల్లోకి వెళ్లి అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరనే వివరాలను తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే వీరిపై 420 (మోసం), 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471 రెడ్ విత్ 34 ఐపీసీ (నకిలీ పత్రాన్ని ఒరిజినల్గా చూపించి మోసం చేయడం, ఒకే రకమైన నేరం కొంతమంది కలిసి చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఏప్రిల్లోనే దందా బయటకు వచ్చినా..
దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫిఏకేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే, దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సు ఉన్న పిల్ల లు వచ్చే అవకాశం లేదని కొందరు బాలరక్షా భవన్ అధికారులే ‘మామూలు’గా మాట్లాడి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క సదరు సర్టిపికెట్లను తీసుకొచ్చారు. వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేసిన విషయం జిల్లా రెవెన్యూ అధికారి, డీడబ్ల్యూఓ విచారణలో తేలింది. అయినా కూడా పోలీసులకు డీడబ్ల్యూఒ ఇచ్చిన ఫిర్యాదులో బాలరక్షాభవన్ సిబ్బంది పేర్లు వెల్లడించకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి, కావాలనే వారి పేర్లు ఇవ్వలేదా అన్న చర్చ కలెక్టరేట్ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలోనే ఓ జంటకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల దందా బయటకు వచ్చినా చర్యలు తీసుకోకుండా, విధుల్లో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఎవరి ప్రమేయముందో తెలుసుకొని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ విభాగంలోని మరికొందరి పనితీరు బాగాలేదంటూ ఫిబ్రవరిలో కావాల్సిన రెన్యువల్ను బుధవారం నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తున్నట్లు తెలిసింది.
‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై కేసు నమోదు
9 మందిపై 420, 468, 471 రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్లు
బాలరక్షాభవన్ సిబ్బందిపై చర్యలు
తీసుకోవాలని ఫిర్యాదు
పేర్లు పిటిషన్లో పేర్కొనకపోవడంతో అనుమానాలు
ఏప్రిల్లోనే నకిలీ సర్టిఫికెట్లని తెలిసినా పట్టించుకోని డీడబ్ల్యూఓ

ఎట్టకేలకు ఎఫ్ఐఆర్