
ఎఫ్ఎస్టీపీ పనులు పూర్తి చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: మూడో దశలో నిర్మాణంలో ఉన్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్టీపీ) పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగర పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో బల్దియా నిర్మిస్తున్న 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ పనులను మేయర్.. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన, పురోగతిలో ఉన్న పనులను, ప్లాన్ఆఫ్యాక్షన్ ప్లాన్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాంట్ను నెలలోగా పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. మిగిలి ఉన్న సివిల్ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అనంతరం 40 కేఎల్డీ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంట్ను సందర్శించిన మేయర్ కమిషనర్లు ఆపరేషన్–మెయింటెనెన్స్ ఏ విధంగా కొనసాగుతుందో పరిశీలించారు. రెగ్యులర్గా సెప్టిక్ ట్యాంకులు వస్తున్నాయా? అని తెలుసుకొని రిజిస్టర్లను పరిశీలించారు. జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతి నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని కమిషనర్.. ప్లాంట్ నిర్వాహకులను ఆదేశించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ సారంగం, ఏఈ సంతోష్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ యాదవ్, సైట్ ఇంజనీర్ ప్రణీత్ తదితరులు ఉన్నారు.
టైలరింగ్ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి
టెక్స్టైల్ పార్కును దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వరంగల్ పరిధిలో మహిళలకు టైలరింగ్లో శిక్షణ కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. గురువారం సాయంత్రం మేయర్ చాంబర్లో మెప్మా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మెప్మా కార్యకలాపాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాక్ మిషన్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో కేంద్రానికి రూ.25 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (స్ట్రీట్ వెండర్స్) సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం, అమృత్ 2.0 చెరువు గట్టు వద్ద మొక్కలు నాటడం, బ్యాంక్ లీంకేజీ తదితర అంశాలపై చర్చించారు.