
23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి హాజరైన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఎరువుల డిమాండ్కు అనుగుణంగా 6 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు 4 వేల ఎకరాలు, ప్లాంటేషన్కు 1,300 ఎకరాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.