
యూరియా సరిపోయెనా..?
● ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా
● రేపు మరో 45,210 బస్తాల రాక
ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరకడం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్లో యూరియా సరఫరా ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నేడు రైతులతో సీఎం ముఖాముఖి
సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్ ఆఫీసర్గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు.