
ఉద్రిక్తత..ఉత్కంఠ
కౌశిక్రెడ్డికి
ఎంజీఎంలో వైద్యపరీక్షలు
ఎంజీఎం : గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి, సుబేదారి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీఎం అత్యవసర విభాగానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్రెడ్డిని నేరుగా కోర్టుకు తరలించారు.
● ఉదయం నుంచి రాత్రివరకు సాగిన
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్
● శంషాబాద్లో అరెస్ట్టు చేసి
హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు..
● బీఆర్ఎస్ నేతల ఆందోళన..
రోడ్డుపై బైఠాయింపు
● సీఎం దిష్టిబొమ్మ దహనం..
విద్యార్థి నేతల అరెస్టు
వరంగల్ క్రైం/కాజీపేట రూరల్: హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రివరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులను నిలువరించేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డు పెట్టి మోహరించారు.
కేసు నమోదు ఇలా..
కమలాపురం మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్రెడ్డిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్లో బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు, తన భర్తకు ప్రాణపాయం ఉన్నట్లు గత ఏప్రిల్ 21న కట్ట ఉమాదేవి సుబేదారి పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ముందుస్తు అరెస్టులు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆ ఉత్తర్వులను ఇటీవల రద్దు చేయడంతో పోలీసులు పథకం ప్రకారం శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ఫోర్ట్లో అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు.
రోడ్డుపై బీఆర్ఎస్ నాయకుల బైఠాయింపు..
పాడి కౌశిక్రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నేతలు రాకేష్ రెడ్డి, సత్యనారాయణరావు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని కలవకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం నేతలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను కలిసి పరిస్థితిని వివరించారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి నేతలు సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు బొల్లికొండ వీరేందర్, రామ్మూర్తి, శరత్, రాజేష్ నాయక్, మహముద్ చోటు, సదంత్, శ్రవణ్ కుమార్, సాయికుమార్, రాజేష్, రాజ్కుమార్ను అరెస్టు చేసి కాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాజీపేట జంక్షన్లో 144 సెక్షన్ విధింపు
కాజీపేట రైల్వే కోర్టుకు కౌశిక్రెడ్డిని తరలించే నేపథ్యంలో పోలీసులు రైల్వే కోర్టు బయట చుట్టూ పక్కల ఎవరు రాకుండా 144 సెక్షన్ విధించారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి పర్యవేక్షణలో సీఐ సుధాకర్రెడ్డి, పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, మీడియాను కోర్టు ప్రాంగణంలోకి రాకుండా కట్టడి చేశారు. మధ్యాహ్నం 3:10 గంటలకు కౌశిక్రెడ్డిని పోలీసులు రైల్వే కోర్టుకు తరలించారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కోర్టుకు వచ్చారు.
అనంతరం రాత్రి 8 గంటల తర్వాత రిమాండ్ను కొట్టివేసి బెయిల్ మంజూరు కావడంతో ఆనందంగా వ్యక్తం చేశారు
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్..
బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి
హన్మకొండ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నందుకే ఈ అరెస్ట్ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేదాక ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామన్నారు.

ఉద్రిక్తత..ఉత్కంఠ

ఉద్రిక్తత..ఉత్కంఠ

ఉద్రిక్తత..ఉత్కంఠ

ఉద్రిక్తత..ఉత్కంఠ

ఉద్రిక్తత..ఉత్కంఠ