
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థుల నమోదు, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కాలేజీలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య, సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్, ఎస్సీ, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ డీడీలు నిర్మల, ప్రేమ కళ, లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ఎం ధరమ్సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
విహారయాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల విహార యాత్రకు వెళ్లెందుకు ఈనెల 27న ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద సూపర్ లగ్జరీ, డిలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్నేహ షబరీష్ తెలిపారు. పూర్తి సమాచారానికి 8977781103, 9493882464, 9573090136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ధరలు, రూట్ల వివరాలతో కూడిన ప్రచార పోస్టర్ను శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
24న డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహ్మద్ వజీర్ సుల్తాన్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు మహాజన సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
స్కూటీ @ 233 చలాన్లు
వరంగల్ క్రైం: ఓ స్కూటీ(ఆక్టివా)పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 233 చలాన్లు ఉన్నాయి. సదరు వాహన యజమానిని హనుమకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న కాజీపేట చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో హనుమకొండకు చెందిన అస్లాం స్కూటీకి సంబంధించిన వివరాలను పరిశీలించి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అతడి బండి నంబర్పై ఏకంగా 233 పెండింగ్ చలాన్ల రూపంలో రూ.45,350 జరిమానా ఉండడంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. జరి మానా మొత్తం చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించారు.

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి