
ప్రణాళికతో చదివితే ‘సివిల్స్’ సాధ్యం
విద్యారణ్యపురి : ప్రణాళికతో చదివితే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధ్యమని హైదరాబాద్లోని ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, (యూపీఎస్సీ ర్యాంకర్–2014) డాక్టర్ జి.వివేకానంద సూచించారు. శనివారం హనుమకొండలోని హరిత కాకతీయలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు సివిల్స్ ఎలా క్లియర్ చేయాలి అనే అంశంపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సివిల్ సర్వీస్ పరీక్ష సిద్ధం, లక్ష్య నిర్ధారణ, విజయానికి అవసరమైన మానసిక సంసిద్ధత వంటి అంశాలను వివరించారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలంటే రోజుకు 15 గంటలు చదవాల్సిన అవసరం లేదని, ఆరు నుంచి 8గంటలు చాలని తెలిపారు. ఐఐటీలు, పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వారే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధిస్తారనేది అపోహ మాత్రమేనని సాధారణ కళాశాలల్లో డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా సరైన ప్రిపరేషన్తో సివిల్లో విజయం సాధించవచ్చన్నారు. వరంగల్ నుంచి పలువురు సివిల్స్లో విజయం సాధించగా వారి వివరాలను కూడా ఉదహరించారు.ప్రస్తుతం ఆన్లైన్లో సివిల్స్ ప్రిపరేషన్కు విస్తృతంగా సమాచారం ఉందని ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే సివిల్లో విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్గా కోచింగ్లు కూడా ఇస్తున్నారన్నారు. ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమి అడ్మినిస్ట్రేషన్ హెడ్ బి. అవినాష్, వివిధ సంస్థల గ్రూప్ డైరెక్టర్లు గిరిప్రకాశ్, గణేష్ మాట్లాడారు. ఈ సదస్సులో వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, పేరెంట్స్ పాల్గొన్నారు. వారు అడిగిన సందేహాలను డైరెక్టర్ వివేకానంద నివృత్తి చేశారు.
ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ
డైరెక్టర్ వివేకానంద