నగరంపాలెం: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని విద్యా సంస్థల సమీపాన 724 దుకాణాలు తనిఖీలు చేశారు. వంద కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లోని దుకాణాల్లో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఖైనీ, సిగరెట్లు, ఈ–సిగరెట్లు, నిషేధిత, హానికరమైన ఉత్పత్తులు విక్రయించరాదని దుకాణాల యాజమానులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ పరిధిలో నెలకొన్న పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, కోచింగ్ సెంటర్ల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని అన్నారు.


