జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అవ్వాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన రాజకీయపార్టీల ప్రతినిధులు, అధికారుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓలు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. డీఆర్వో షేక్ ఖాజావలి ఎన్యుమరేషన్ ఫారాలు ఏ విధంగా పూర్తి చేయాలనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఓలు బీఎల్ఏలతో సమావేశాలు నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు మార్గదర్శకం చేయాలన్నారు. సమావేశపు మినిట్స్ను యాప్లో అప్ లోడ్ చేయాలన్నారు. జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరుకు రెండు ఫారాలను అందించి పూర్తి చేసిన ఫారాలలో ఒక దాని మీద ఓటరు సంతకం చేసిన ఫారాన్ని తీసుకొని, బీఎల్ఓ సంతంకం చేసిన ఫారాన్ని ఓటరుకు అందించాలన్నారు. తర్వాత వాటిని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఇలా చేయడం వలన డెత్, వలసలు, డూప్లికేట్లను గుర్తించవచ్చన్నారు. ఈ వివరాలన్నీ డీఈఓ లాగిన్లో కనిపిస్తాయన్నారు. పోలింగ్ స్టేషన్ల మార్పులు, చేర్పులకు జూలై 14 వరకు ప్రతిపాదనలు పంపవచ్చన్నారు. డ్రాప్ట్ పబ్లికేషన్ను జూలై 21న ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు, ఫిర్యా దులు ఏమైనా ఉంటే జూలై 21 నుండి ఆగష్టు 20 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు జులై 21 నుండి సెప్టెంబర్ 18 పరిష్కరిస్తారని, తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 22న విడుదల చేస్తామన్నారు. తాడికొండ, మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ లొకేషన్ మార్పులు, ప్రతిపాదించిన కొత్త పోలింగ్ స్టేషన్న్స్కు రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయి. పొన్నూరు, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల పరిధిలో మార్పులపై పెండింగ్లో ఉంచామని తెలిపారు. సమావేశంలో గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, శ్రీరమణి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, అధికారులు, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


