తెనాలి: పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్, శ్రీమహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి (69) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కొద్దిరోజుల క్రితం శ్వాససంబంధిత అనారోగ్యానికి గురయిన ఆయన్ను, ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఆయనకు భార్య రత్నకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికదేహాన్ని బుర్రిపాలెంరోడ్డులోని ఆశ్రమానికి తరలిస్తామని సోదరుడు వజ్రాల నాగరాజు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. విద్యాధికుడైన రామలింగాచారి డాక్యుమెంట్ రైటర్గా జీవనం సాగిస్తున్నారు. విద్యార్థి దశలో స్కూలు వార్షికోత్సవంలో గాంధీ పాత్రలో నటించారు. తర్వాత కాలంలో మహత్మాగాంధీ ఆత్మకథ చదివి ప్రభావితుడయ్యారు. గాంధీ స్ఫూర్తితో 2004లో స్థానిక కొల్లావారి వీధిలో ఆశ్రమాన్ని స్థాపించారు. కుటుంబ సభ్యులు లేని ఒంటరి వృద్ధుల పోషణ, వైద్యాన్ని చూస్తున్నారు. దాతల సహకారంతో బుర్రిపాలెంరోడ్డులోని ఇంజినీరింగ్ కాలేజి సమీపంలో ఆశ్రమానికి సొంత భవనం నిర్మించారు. 2020లో ఆశ్రమాన్ని అక్కడకు తరలించారు. 30 మందికిపైగా ఆశ్రయం కల్పించారు. అదే ఆశ్రమంలో గాంధీజీ, కస్తూర్బాల విగ్రహాలను ఏర్పాటుచేసి రోజూ పూజలు చేస్తున్నారు. గాంధీజీ సమాజానికి చూపిన శాంతి, అహింస ప్రచారం చేస్తున్నారు. ‘గాంధీ హృదయధారి’తో సహా పలు గౌరవాలను అందుకున్నారు. రామలింగాచారి మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.


